Tuesday 3 November 2009

భావయామి గోపాలబాలం (Translation)

భావయామి గోపాలబాలం మన -
స్యేవితం తత్పదం చింతయేయం సదా ||

కటిఘటిత మేఖలా ఖచితమణిఘంటికా -
పటలనినదేవ విభ్రాజమానం
కుటిల పదఘటిత సంకుల శింజీతేన తం
చటులనటనా సముజ్జ్వల విలాసం ||

నిరత, కర, కలిత నవనీతం బ్రహ్మాది -
సురనికర భావనా శోభిత పదం
తిరువేంకటాచల స్థితమనుపమం హరిం
పరమ పురుషం గోపాల బాలం ||

[ అన్నమయ్య ఆధ్యత్మిక సంకీర్తన ]

తత్పదం = అతని పదములను
కటిఘటితమేఖలా = మొలనున్న త్రాటికి
సదా = ఎల్లప్పుడు
ఖచితమణిఘంటికా = ఉన్న మణిఘంటి యొక్క
పటిలనినదేన = స్పష్టమైన శబ్దముతో
విభ్రాజమానం = ప్రాశించువానిని
కుటిలపదఘటిత = వంకరగా నడచు పదముల యందున్న
చటులనటనాసముజ్జ్వలవిలాసం = ప్రకాశించు నృత్య విలాసము గలవాడు
నిరత కరకలితనవనీతం = ఎల్లప్పుడు చేతియందు వెన్న గలిగి ఉండువాడు
బ్రహ్మాది సురనికరభావనాశోబితపదం = బ్రహ్మాది దేవతలు భావించే పదములు కలవాడు
అనుపమం = అద్వితీయుడైన
హరిం = హరిని
భావయామి = భావించెదను

సత్య జ్ఞానానంద స్వరూపుడును, నిత్య సిద్ధుడును, ఈ సకల చరాచర సృష్టిలో ఉత్తముడును, సాక్షి స్వరూపుడును, అపరిమిత సామర్ధ్యము కలవాడును అయిన శ్రీ కృష్ణభగవానుడు సర్వజనులకు నంతర్యామి స్వరూపుడయి ఉండువాడు. యోగుల చేత ఎల్లప్పుడును ధ్యానింపబడువాడు. ఇతడు సకల జగత్తుకును, సృష్టి స్థితి సంహారకర్త! ఈ మనుష్య లోకమున అందరినీ ఆనందింపజేయుచుండును. నారదుడు మొదలగు మహా యోగుల చేత నిత్యము సేవింపబడువాడు. ఇట్టి శ్రీకృష్ణ భగవానుని మనః పూర్వకంగా సేవిస్తూ తరిస్తున్నాడు అన్నమాచార్యులు. అన్నమాచార్యులవారు వేలకొలది తెలుగు లో సంకీర్తనలను రచించినను, అందులో కొన్ని సంస్కృత సంకీర్తనలు కూడ కలవు. బాలకృష్ణ కిషోరుని 'భావయామి గోపాలబాలం' అనే సంస్కృత సంకీర్తనలో ఇలా వర్ణిస్తున్నాడు.

నడుమ మొల నూలుకు కూర్చబడిన మణి ఘంటల సవ్వడితో ప్రకాశించు వాడును, వివిధ నవ్య నాట్య భంగిమలతో పాదములు తాటించుటతో ఘల్లు, ఘాల్లు మను ధ్వనితో కూడిన ఆబాలగోపాలుని పాద ద్వయాన్ని ఎల్లప్పుడు స్మరిస్తాను. చేతి వెన్నముద్ద గల బాలకృష్ణుని, బ్రహ్మాది దేవతలందరూ భక్తిభావంతో కొలుస్తున్నారు. ఉత్తమ స్థానమయిన (వైకుంఠం) తిరు వేంకటాచలం పై వెలసిన ఆ తిరువేంగళ నాధుడే బాల గోపాలుడు.


By -
Dr.Chelikani Murali Krishna Rao,
'Padakavita pitamahudu Sri Taallapaaka Annamacharya jivita charitra mariyu sankeertanalu'
Available at Visalandhra Book Stores for Rs.150/- only.

2 comments:

Vasu said...

బావుంది మీ బ్లాగ్.
అన్నమాచార్య సంస్కృతం లో కూడా రాసారని తెలియదు నాకు. ఈ కీర్తన చూడగానే ఏంటి ఇదంతా సంస్కృతంలా ఉంది. అన్నమ్మయ్య కీర్తనేనా అని అడగబోతుండగా మీరే (కృష్ణా రావు గారి ద్వారా ) వివరించారు. థాంక్స్.
ఎం .ఎస్ అమ్మ కంఠం లో ఈ కీర్తన వింటుంటే అప్రయత్నంగా భక్తి భావం కలుగుతుంది. వళ్ళు పులకిస్తుంది.

GKK said...

ముఖ్యంగా ’చటులనటనా’ అన్న పదభాగము దగ్గర ఎమ్మెస్ వేసిన సంగతి కడు రమణీయంగా ఉంటుంది.
సాధారణంగా వాగ్గేయకారుల సంస్క్రుత కీర్తనలు ద్వితీయావిభక్తిలో ఉండటం గమనించివచ్చు. అలాగే అన్నమయ్య జయదేవుని అష్టపదుల శైలిలో వ్రాసిన సంభాషణ రూపంలో వ్రాసిన ’సకలం హే సఖి’ కీర్తన ఒక masterpiece

శ్రీనివాసం నమామ్యహం

 
శ్రీనివాసం - Templates Novo Blogger